కడెం, డిసెంబర్ 1: దేశంలో 42వ టైగర్జోన్ (కవ్వాల్ అభయారణ్యం) ఏర్పాటు కావడంతో నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తురాబాద్ మండలాలతో పాటు, మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలాల్లోని 23 గ్రామాలను ఈ ప్రాంతం అటవీ నుంచి ఖాళీ చేయించి వారిని ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు. అయితే అనేక ఏండ్ల పాటు అడవిలో జీవిస్తున్న ఆదివాసీలు మొదటగా ఈ ప్రాంతాలను ఖాళీ చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ ప్రభుత్వం ముందుకొచ్చి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసీలు వెళ్లడానికి ఆసక్తి చూపించారు.
వనాన్నే నమ్ముకొని అటవీ సంపద ద్వారా తడకలు, బుట్టలు, ఇతర పండ్లను సేకరిస్తూ, వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించిన వారికి ప్రభుత్వం పునరావాసం పేరిట మెరుగైన సౌకర్యాలను కల్పించనుంది. ఇందులో భాగంగా అభయారణ్యం పరిధిలోని కడెం మండలంలోని రాంపూర్, మైసంపేట గ్రామాలను మొదటి విడుత కింద ఎంపిక చేసిన అటవీశాఖ అధికారులు ఈ గ్రామాలు పూర్తి అటవీ ప్రాంతంలో ఉండడంతో వాటిని ముందుగా తరలించాలని నిర్ణయించారు.
రాంపూర్, మైసంపేట గ్రామాలకు చెందిన 94 కుటుంబాలకు కడెం మండలంలోని కొత్తమద్దిపడగ గ్రామ సమీపంలో స్థలాన్ని కేటాయించి ఇండ్ల నిర్మాణం చేపట్టారు. డబుల్బెడ్ రూం ఇండ్లు, వాటికి మౌలిక సౌకర్యాలు కల్పించారు. అలాగే ఆదివాసీల కుటుంబాల కోసం కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రం, రక్షిత మంచినీటి ట్యాంక్, చిన్నారుల కోసం ఆటవస్తువుల ఏర్పాటు, గ్రామానికి స్వాగతహారం, సీసీ రోడ్లు, ఇండ్ల ముందు ఆదివాసీల కలలకు సంబంధించిన పెయింటింగ్స్, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయితే 94 కుటుంబాలకు సంబంధించిన ఇండ్ల పనులు ఇప్పటికే పూర్తికాగా, పెయింటింగ్ పనులు చేపడుతున్నారు.
వీరికి ఇండ్ల నిర్మాణంతో పాటు, కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తార్పు గ్రామ శివారులో ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి చొప్పున కేటాయించి, చదును చేయించారు. కొత్తమద్దిపడగ ప్రాంతంలో నివాస గృహాలు, అదే గ్రామాన్ని ఆనుకొని ఉన్న పెత్తార్పు ప్రాంతంలో వ్యవసాయ భూములను కేటాయించడంతో వారికి సాగుకు ఇక ఇబ్బందులుండవు. ఇండ్లకు, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సౌకర్యాలను కూడా పూర్తి చేశారు. త్వరలోనే ఇండ్ల ప్రారంభం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
రాంపూర్, మైసంపేట గ్రామాల్లో నివసించిన మమ్మల్ని మైదాన ప్రాంతాలకు తరలించడం ఆనందంగా ఉంది. అటవీ ప్రాంతాల నుంచి మాకు ఇండ్ల నిర్మాణం, వ్యవసాయ భూమిని కేటాయించి సకల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వానికి మా 94 కుటుంబాలు రుణపడి ఉంటం. అడవిలో ఉండే మాకు ఇలాంటి సౌకర్యాలు కల్పించి, మమ్మల్ని ఆదుకున్న సర్కారుకు ధన్యవాదాలు.
-జైవంత్రావు, లబ్ధిదారుడు