దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ జీపీ భవనం.. కార్పొరేట్ కార్యాలయానికి దీటుగా రూపుదిద్దుకున్నది. తెలంగాణ సర్కారు సహకారం.., సర్పంచ్ గంగారెడ్డి కృషితో అన్ని హంగులతో నిర్మితమైంది. సర్పంచ్, కార్యదర్శులకు ప్రత్యేక గదులు, పాలక వర్గ సమావేశ మందిరం, గ్రామ సభలకు ప్రత్యేక హాలుతో పాటు మరుగుదొడ్ల నిర్మాణంతో త్వరలో ప్రారంభానికి ముస్తాబైంది. ఇటీవల భవనాన్ని పరిశీలించిన నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి నుంచి అభినందనలు అందుకోగా, గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– దిలావర్పూర్, ఆగస్టు 28
సాదారణంగా గ్రామాల్లోని పంచాయతీ భవనాలు అంటే రెండుమూడు గదులతో కూడి ఉండడం చూసి ఉంటాం. కానీ, మండలంలోని సిర్గాపూర్ జీపీ భవనం కార్పొరేట్కు ధీటుగా ముస్తాబైంది. ఉపాధి హామీ నిధులు రూ. 20 లక్షలతో నిర్మించిన ఈ భవనంలో సర్పంచుకు ప్రత్యేక గది, పాలక వర్గం సమావేశ మందిరం, పంచాయతీ కార్యదర్శికి గది, గ్రామ సభలు నిర్వహించేదుకు ప్రత్యేక హల్తో పాటు, వ్యక్తి గత మరుగుదొడ్డి నిర్మించారు. ఈ గదులను అందంగా తీర్చిదిద్దడంతో పాటు, ఫరినచర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ భవనం ప్రహరీ నిర్మాణానికి ఏసీడీపీ నిధులు రూ.5 లక్షలు మంజూరు చేశారు. దీంతో నిర్మాణం పూర్తికాగా పచ్చని చెట్లతో ఆహ్లాదంగా మారింది.
సిర్గాపూర్ నూతన గ్రామ పంచాయతీ భవనం త్వరలోనే ప్రారంభించేందుకు స్థానిక సర్పంచ్, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి మం త్రిని ఆహ్వానిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. అం దుకు ముహూర్తం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
మూడ్రోజుల క్రితం గ్రామ పర్యటనకు వచ్చిన నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి జీపీ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ తరహాలో నిర్మించాని సర్పంచ్, అధికారులను అభినందించారు. ఇతర గ్రామాల్లో నూతనంగా నిర్మించే జీపీ భవనాలను ఇలాగే నిర్మించాలని సంబంధిత అధికారులను అక్కడి నుంచే ఆదేశించారు.
చాలా ఏండ్ల నుంచి చిన్న గదిలో గ్రామ పంచాయతీ కొనసాగుతూ వచ్చింది. నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత భవనం గురించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. నూతన జీపీ భవన నిర్మాణం కోసం ఉపాధి హామీ ద్వారా రూ.20 లక్షలు మంజూరు చేశారు. అలాగే ప్రహరీ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వడంతో పనులు పూర్తి చేశాం. నా హయాంలో పంచాయతీ భవనం కట్టించాలనే కోరిక నేరవేరింది.
– గంగారెడ్డి, సర్పంచ్, సిర్గాపూర్