మంచిర్యాల, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి గురువారం మంచిర్యాలలో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. మంచిర్యాల జిల్లా ర్యాలీ సమీపంలోని ఈద్గాలో ఎప్పటిలాగే ఈ ఏడాది ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు నిర్వహించారు. నిష్టతో ఉపవాసాలు చేసి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ముస్లిం సోదరులు నిర్వహించే ఈ వేడుకలో కాంగ్రెస్ నేతలు ఓట్లు అభ్యర్థించారు.
ఈద్గాలోకి వెళ్లడమేగాక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ సాబ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓ వ్యక్తి ప్రార్థన చేసే మైక్లో అనౌన్స్ చేశారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సైతం అదే మైక్ దగ్గరకు వెళ్లి ముస్లిం సోదరులనుద్దేశించి మాట్లాడారు. కొన్ని హామీలు సైతం ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కాంగ్రెస్కు ఓటు వేయాలని పిలుపునివ్వడంపై ముస్లిం సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రసంగం అయిపోయాక కొందరు ముస్లిం సోదరులు చప్పట్లు కొట్టగా, అక్కడున్న మతపెద్ద వెంటనే ఖండించారు.
ఈద్గా లోపల చప్పట్లు కొట్టడం సరికాదంటూ చురకలు అంటించారు. కార్యక్రమం అనంతరం కొందరు ముస్లింలు కూడా ఈద్గా లోపలికి వచ్చి ఎమ్మెల్యే మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ వేడుకలను రాజకీయ వేదికగా మార్చి, ఓట్లు అభ్యర్థించడమమేమిటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ సైతం పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి. అలాంటిది రంజాన్ పండుగ వేడుకలో ఓట్లు అభ్యర్థించడం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలోకి రాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా పర్మిషన్ లేకుండా ఏ కార్యక్రమంలోనూ డ్రోన్ ఉపయోగించ వద్దని ఇటీవల పోలీస్ కమిషనర్ ఆదేశాలు కూడా ఇచ్చారు.
అవేవీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ఈద్గాలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో డ్రోన్తో వీడియోలు, ఫొటోలు తీయించారు. డ్రోన్ వాడకానికి సంబంధించి ఎవ్వరూ ముందస్తు అనుమతులు తీసుకోలేదని రామగుండం సీపీ కార్యాలయం, మంచిర్యాల పోలీసులు తెలిపారు. ఇలా యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
35 ఏండ్లుగా రంజాన్ వేడుకల్లో పాల్గొంటున్నా. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ వేడుకల్లో ఏనాడూ రాజకీయాలు చేయలేదు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా కాంగ్రెస్ వ్యవహరించడం సరికాదు. ఈద్గా లోపలికి వెళ్లి ఓట్లు అడగడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎనికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా మంచిర్యాలలో ముస్లిం సోదరుల అభ్యున్నతికి కృషి చేశా. రానున్న రోజుల్లో మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉంటాను.
– దివాకర్రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే