ఎదులాపురం, ఫిబ్రవరి 27 : రైతులు పండించిన ప్రతి పంటను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా మార్కెట్ యార్డ్ను సందర్శించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సొయాబీన్ కొనుగోలు చేస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బుధవారం వరకు మద్దతు ధరకు కొనుగోలును ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం సమర్పించారు. ఆయన వెంట ఎంపీపీ గండ్రత్ రమేశ్, జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, బీఆర్ఎస్ నాయకులు కుమ్ర రాజు, సేవ్వా జగదీష్, రాజన్నలు ఉన్నారు.