కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 2 : జిల్లా కేంద్రంలోని రోజ్గార్డెన్లో శనివారం కాంగ్రెస్ నిర్వహించిన కుల గణన సమావేశం రణరంగంగా మారింది. తమకు సమాచారం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్రావును నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, అతని వర్గీయులు నిలదీయడంతో ఘర్షణ చోటు చేసుకున్నది. స్టేజీపైనే ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.
పిడిగుద్దులు గుద్దుకుంటూ.. వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఈ దాడిలో కార్యకర్త గడ్డల సత్తకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కల్పించుకొని శ్యాంనాయక్తో పాటు అతని అనుచరులను సమావేశం నుంచి బయటకు పంపించారు. రోడ్డుపై శ్యాంనాయక్, అతని వర్గీయులు ధర్నా చేశారు. తమపై దాడికి పాల్పడిన అనిల్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు.
ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం కల్పించుకొని శ్యాంనాయక్ వర్గీయులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసులు బలవంతంగా శ్యాంనాయక్తో పాటు అతని అనుచరులను అరెస్ట్చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
సీఐలు బుద్ధస్వామీ, రవీందంర్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఎస్ఐలు రాజేశ్వర్, చంద్రశేఖర్, సిబ్బంది పహారా మధ్య కాంగ్రెస్ పార్టీ సమాశం కొనసాగింది. కాగా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు వర్గం, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్ వర్గం మధ్య కొంతకాలంగా అంతర్గత పోరు జరుగుతున్న విషయం విదితమే.