ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా జ్వరాలు పెరుగుతుండడంతో వైద్యశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. వారం పాటు ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. జ్వర ప్రభావిత గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 126 సబ్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించి దోమలు పెరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
– ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. డెంగీ, వైరల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలతోపాటు అపరిశుభ్రత కారణంగా జ్వరా లు వస్తుండడంతో వీటి నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లాలోని 22 ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 126సబ్ సెంటర్ పరిధిలోని గ్రా మాల్లో వైద్య బృందాలు పర్యటిస్తాయి. ప్రతి టీం లో మెడికల్ ఆఫీసర్, హెల్త్ సూపర్ వైజర్, ఏఎన్ ఆశ కార్యకర్తలు ఉంటారు. గ్రామాల్లో వీరు ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహిస్తారు. ఎవరైనా జర్వం, ఇతర వ్యాధి లక్షణాలతో బాధపడుతుంటే వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తారు. దోమల నివారణపై ప్రజలకు వైద్యశాఖ అధికారులు, సిబ్బంది అవగాహన క ల్పిస్తారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచ డం, మురికి కాల్వలు, చెత్తాచెదారం లేకుండా చూసుకునేలా, నీటి నిల్వలు ఉండకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తారు. గ్రామాల పరిశుభ్రతలో పంచాయతీ సిబ్బంది సాయం తీసుకుంటారు. రోజు రెండు గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి జ్వరాల నివారణకు కృషి చేస్తారు.
పకడ్బందీ పర్యవేక్షణ
జిల్లాలో వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను వైద్యశాఖ ఉన్నతాధికారులు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 22న ప్రారంభమైన దోమల నివారణ, ఫీవర్ సర్వే, వైద్య శిబిరాలు నిర్వహణ వారం రోజులపాటు కొనసాగనుంది. జిల్లా వైద్యాధికారితోపాటు డిప్యూటీ డీఎంహెచ్ జిల్లా మలేరియా అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి దోమల నివారణ, ఫీవర్ సర్వే, మెడికల్ క్యాంపుల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో వైద్యబృందాలకు పర్యటన ఫొటోలను పంపించాలని అధికారులు సూచిస్తున్నారు. ఫీవర్ సర్వేలో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించి జ్వరాల తీవ్రతను బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు అందించడంతోపాటు అవసరమై వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ పంపిస్తున్నారు.
ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలి
జిల్లాలో కొన్ని రోజులుగా డెంగీ, వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం, దోమలు వృద్ధి చెందడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమల నివారణలో భాగంగా నీటి నిల్వలు లేకుండా చూడాలి. డెంగీ కేసులకు భయపడి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా సర్కారు దవాఖానలకు వచ్చి వైద్యసేవలు పొందాలి. వ్యాధుల నివారణకు జిల్లాలో వారం రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్