మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/నిర్మల్ అర్బన్/ఎదులాపురం, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెరిసింది. చదువుల తల్లి బాసర సరస్వతీ కొలువుదీరిన నిర్మల్ జిల్లా గతేడాది మాదిరిగానే ఈ యేడాది అత్యధిక ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచింది. గతేడాది 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ సంవత్సరం 99.05 శాతంతో టాప్లో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా 17, మంచిర్యాల 20, కుమ్రం భీం ఆసిఫాబాద్ 31వ స్థానంలో నిలిచాయి. నిర్మల్ జిల్లాలో 8,908 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో బాలురు 4,246 (98.74 శాతం), బాలికలు 4,577(99.33 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 85 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో 10,374 మంది పరీక్ష రాయగా.. బాలురు 4,744(91.60 శాతం), బాలికలు 4,897(94.26 శాతం) పాస్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో 9,283 మంది ఎగ్జామ్ రాయగా.. బాలురు 4,338(91.36 శాతం), బాలికలు 4,241(93.52శాతం) మంది అర్హత సాధించగా 704 మంది పరీక్షల్లో తప్పారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో కింది నుంచి మూడో స్థానంలో నిలిచింది. 6,393 మంది పరీక్షలు రాస్తే బాలురు 2,366(78.66 శాతం), బాలికలు 2,959(87.42 శాతం) పాస్ అవ్వగా.. 1,068 మంది ఫెయిల్ అయ్యారు. నాలుగు జిల్లాల్లోనూ అమ్మాయిలే సత్తా చాటారు. అబ్బాల కంటే అధిక ఉత్తీర్ణత సాధించారు.
188 మందికి 10 జీపీఏ.. 71 స్కూల్స్లో 100 శాతం ఉత్తీర్ణత..
మంచిర్యాల జిల్లాలో 188 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. స్థానిక సంస్థల స్కూల్స్లో ముగ్గురు, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్స్లో 10 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 160 మంది, మైనార్టీ రెసిడెన్షియల్స్లో ఒక్కరు, మోడల్ స్కూల్స్లో ఐదుగురు, రెసిడెన్షియల్ బడుల్లో ఒక్కరు, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఎనిమిది మంది 10 జీపీఏ సాధించారు. జిల్లావ్యాప్తంగా 71 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. స్థానిక సంస్థల స్కూల్స్ 21, మహాత్మా జ్యోతిబా ఫూలే బడులు ఐదు, ప్రైవేటు పాఠశాలలు 29, మైనార్టీ రెసిడెన్షియల్స్ రెండు, మోడల్ స్కూల్స్ రెండు, రెసిడెన్షియల్ ఒకటి, కేజీబీవీలు మూడు, ఎయిడెట్ ఒకటి, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు నాలుగు, వెల్ఫేర్ స్కూల్స్ మూడు చొప్పున 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.