రెబ్బెన, ఏప్రిల్ 29 : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం ఎడవెల్లి, రెబ్బెన ఎస్సీకాలనీలోని అమ్మ ఆదర్శ పాఠశాలలను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్, తాగు నీటి సౌకర్యం కల్పించడంతో పాటు మూత్రశాలలు, అదనపు తరగతి గదులకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. వేసవి సెలవులు ఉన్నందున పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు, విద్యుత్ సరఫరాతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, మూత్రశాలల్లో నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీవో సురేందర్, తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీవో శంకరమ్మ, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, స్పెషల్ అఫీసర్ ప్రభాకర్, డీఈ రాజన్న ఉన్నారు.