ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 6: ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జడ్పీ సమావేశ మందిరం వరకు కాగడాను వెలిగించి ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ సమావేశ మందిరంలో ఓటర్ అవగాహనపై కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఏప్రిల్ 1వ తేదీ వరకు 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఫారం నం-6 నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలని కోరారు. ఆన్లైన్ దరఖాస్తు యాప్లో తమ ఆధార్ కార్డు , ఎస్ఎస్సీ మార్క్ మెమో ఆధారంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న వారితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, మున్సిపల్ కమిషనర్ మహ్మద్ ఖమర్ అహ్మద్, అంగన్వాడీలు, క్రీడాకారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.