ఎదులాపురం, మే 19 : వేసవి దృష్ట్యా ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు వచ్చే రోగులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రిమ్స్ దవాఖానను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటి అంతస్తులోని ఆర్వో ప్లాంట్, రెండు, మూడో అంతస్తుల్లో ఫ్రిజ్ల ద్వారా అందిస్తున్న తాగునీటి వసతులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రిమ్స్కు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. వేసవి నేపథ్యంలో దవాఖానకు వచ్చే ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్వో ప్లాంట్ను వెంటనే ఏర్పాటు చేయాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను ఆదేశించారు. రిమ్స్ ప్రాంగణంలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, పారిశుధ్య పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా నీటి వనరుల సంరక్షణ, నిర్వహణ విభాగంలో జాతీయ నీటి అవార్డులను ప్రకటించిందని, ఇందులో ఆదిలాబాద్ జిల్లాకు 3వ ర్యాంక్ రావడం చాలా సంతోషకరమైన విషయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఇందుకు అహర్నిశలు కృషి చేసిన, ఉత్తమ పనితీరు కనబరిచిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామన్నారు.