ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 16 : ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (జన్మన్) పథకం ద్వారా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సోమవారం దేశవ్యాప్తంగా జన్మన్ పథకం ప్రారంభించిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, జిల్లా అధికారులు, ఆదివాసులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని 149 గ్రామాల్లో గృహ నిర్మాణాలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, మెరుగైన విద్య, పోషకాహారం, విద్యుత్, రహదారులు, టెలికాంవంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, రెబ్బెన జడ్పీటీసీ సంతోష్, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.