ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, ఫిబ్రవరి 10 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి సెక్టోరియల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులు భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
అధికారులకు కేటాయించిన రూట్ మ్యాప్లను పాటించాలని, ఈవీఎంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ రోజున ఈవీఎంలలో సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున ముందస్తుగా మాక్ పోలింగ్ నిర్వహించాలని, అధికారులు తమకు కేటాయించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పేర్కొన్నారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి పాల్గొన్నారు.
పీవీటీజీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద పీవీటీజీలకు వైద్య సేవలు అందించేందుకు ఒప్పంద పద్ధతిన వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లను నియమించామన్నారు. మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు మొబైల్ హెల్త్ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పీవీటీజీ కుటుంబాన్ని సందర్శించి ఆరోగ్య వివరాలు సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి తుకారాం, సిబ్బంది తపాల్గొన్నారు.