హాజీపూర్, మార్చి 23 : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంచిర్యాల కలెక్టర్ బదాత్ సంతోష్ అన్నారు. శనివారం హాజీపూర్ మండలం ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను హాజీపూర్ నాయబ్ తహసీల్దార్ హరితతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, రిజిష్టర్లు, రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలన్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున పూర్తి చేసిన సిలబస్ను మరోసారి రివిజన్ చేయాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. వేసవి కాలం అయినందున ఎవరైనా అస్వస్థతకు గురైనట్లయితే వెంటనే అవసరమైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. ఇక్కడ పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్తో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
హాజీపూర్ మండలం వేంపల్లి, రాపల్లి – 2, పడ్తన్పల్లి అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్.. జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి చిన్నయ్య, మంచిర్యాల ప్రాజెక్టు సీడీపీవో విజయలక్ష్మితో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, రిజిష్టర్లు, రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని పిల్లల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పిల్లలు, గర్భిణులు, కిశోర బాలికలకు పౌష్టికాహారాన్ని సకాలంలో అందించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భం దాల్చిన మహిళల వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ దవాఖానల్లో నమోదు చేయించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. అనంతరం అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా పిల్లలతో అక్షరాలు దిద్దించారు. అన్న ప్రాసన, సీమంతం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పడ్తన్పల్లి గ్రామంలోని నర్సరీని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్, హాజీపూర్ నాయబ్ తహసీల్దార్ హరితతో కలిసి సందర్శించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వేసవి అయినందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వడదెబ్బ సంబంధిత మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయ కర్త రజిత, అంగన్వాడీ కేంద్రాల సూపర్వైజర్లు, టీచర్లు, మండల పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఏపీవో మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, మార్చి 23 : జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం పరిసరాలు, సీసీ టీవీ గదిని పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు.