మందమర్రి, జనవరి 11: ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు.
మున్సిపల్ కమిషనర్ గద్దె రాజును దరఖాస్తుల వివరాలు, ఆన్లైన్ విధానం.. తదితర వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 17వ తేదీకల్లా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ అచ్యుత్, సిబ్బంది పాల్గొన్నారు.
నస్పూర్, జనవరి 11 : గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రాథమిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు పక్కాగా రూపొందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్తో కలిసి పంచాయతీ అబివృద్ధి ప్రణాళికలు, మండల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఆయా స్థాయిల్లో అవసరాలను గుర్తించి.. అందుకనుగుణంగా నిధులు కేటాయిస్తూ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీఈవో నరేందర్, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.