నస్పూర్, ఏప్రిల్ 20 : పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల పరిశీలకుడు సమీర్ నైరంతర్య అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్తో కలిసి ఆర్డీవోలు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో భాగంగా చేసే ప్రతి ఖర్చునూ తప్పనిసరిగా లెక్కించాలని తెలిపారు. సీ-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించాలన్నారు. సరైన ఆధారం లేకుండా పట్టుబడే నగదు, మద్యం, బంగారాన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29న ఉపసంహరణ, తుది జాబితా అనంతరం మే 13న పోలింగ్ ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.