నస్పూర్,ఫిబ్రవరి 8 : వేసవి సమీపిస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాహుల్తో కలిసి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారుల సమన్వయంతో ఇంజినీరింగ్, మున్సిపల్ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా నీటిని సరఫరా చేయాలన్నారు. ఆస్తి, ఇతర పన్నులు 100 శాతం వసూలయ్యేలా చూడాలని ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్ల కోసం ఇంటింటికీ తిరిగి వివరాలు పరిశీలించాలన్నారు.
అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్లో జాతీయ విపత్తుల ప్రతిస్పందన బృందం 10వ బెటాలియన్ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, 10వ బెటాలియన్ విజయవాడ ఇన్స్పెక్టర్ బీటన్సింగ్, జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్యతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సీపీఆర్ చేయడం వల్లప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. విపత్తుల సమయంలో యువత స్వచ్ఛందంగా ముందుకు సాయమందించాలని కోరారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ప్రతినిధులు గ్యాస్ సిలిండర్ ద్వారా అకస్మాత్తుగా మంటలు వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో యాదయ్య, జిల్లాఅగ్నిమాపక శాఖ అధికారిఅజయ్కుమార్ పాల్గొన్నారు.