మంచిర్యాల ఏసీసీ, జనవరి 26 : జిల్లాలోని పురపాలక సంఘాల ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన జంక్షన్లను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బీ. రాహుల్, డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్వో శివ్ఆశీష్సింగ్, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్తో కలిసి ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పురపాలక సంఘం అభివృద్ధి, ఆధునీకరణ, సుందరీకరణలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీటాకీస్ చౌరస్తాలో ప్రకృతి నేపథ్యం, బెల్లంపల్లి చౌరస్తాలో దేశభక్తి నేపథ్యంతో జాతీయ జెండా, త్రివిధ దళాల సైనికుల ప్రతిమలు, వెంకటేశ్వర టాకీస్ చౌరస్తాలో కుటీర పరిశ్రమలు ప్రతిబింబించేలా జంక్షన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, పోలీసు అధికారులు, మున్సిపల్, మెప్మా సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.