నస్పూర్, మే 20 : ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్లోని కలెక్టర్లో జిల్లా ఇంటర్ అధికారులు, పోలీసులు, పంచాయతీ, రెవెన్యూ, రవాణా, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని, ఇందుకోసం జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4510 మంది జనరల్, 402 మంది ఒకేషనల్, ద్వితీయ సంవత్సరంలో 2005 మంది జనరల్, 383 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలురు, బాలికల పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 704 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్ష న్ అమలులో ఉంటుందని చెప్పారు. ఈ కా ర్యక్రమంలో మంచిర్యాల సీఐ అశోక్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శైలజ, డీపీవో వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.