నస్పూర్, మార్చి 1 : ధరణిలో నమోదైన భూ దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 9వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండల అధికారులు తమపరిధిలో నమోదైన భూ దరఖాస్తులు, ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. 18 మండలాల్లోని ప్రతి తహసీల్దార్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు దరఖాస్తు సమయంలో జతపర్చిన దస్తావేజులు, సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలిస్తాయని తెలిపారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధరణిలోని వివిధ మాడ్యూల్స్ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.