ఆదిలాబాద్, జనవరి 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మూడో దశ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, అర్హులైన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇదిలాఉంటే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో జ్వర సర్వే చేపట్టాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వైద్య బృందాలు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ జ్వరం, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లనొప్పులు, ఇతర లక్షణాలున్న వారికి అవసరమైన చికిత్స అందజేస్తారు. వైద్య, రెవెన్యూ, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు వైద్య బృందాల్లో ఉంటారు. గతేడాది కరోనా రెండో దశలో ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితాలు ఇచ్చింది. వైద్యబృందాలు గ్రామాల్లోకి వెళ్లి అనారోగ్యంగా ఉన్న వారితో పాటు కొవిడ్ లక్షణాలు కనిపించిన వారికి కిట్లు పంపిణీ చేశారు. దీంతో ప్రజలకు ప్రాథమిక దశలోనే వైద్యం అంది వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.
ఉమ్మడి జిల్లాలో 2533 బృందాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జ్వర సర్వేలో భాగంగా గతేడాది వైద్య సిబ్బంది, రెవెన్యూ, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి 2533 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సారి కూడా అదే సంఖ్యలో వైద్య బృందాలు సర్వే నిర్వహించే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 783 వైద్య బృందాలు, నిర్మల్ జిల్లాలో 588 సర్వే టీంలు, మంచిర్యాల జిల్లాలో 610 బృందాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 552 వైద్యబృందాల్లో గ్రామాల్లో తిరుగుతూ సర్వే చేపట్టానున్నాయి. ప్రతి టీం రోజు 25 ఇండ్లకు వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. కరోనా నివారణలో భాగంగా సర్కారు చేపట్టిన జర్వ సర్వే మూడో దశ నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందని వైద్యాధికారులు, ప్రజలు అంటున్నారు.