శ్రీరాంపూర్, ఏప్రిల్ 18 : సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) యూనియన్ను బీఆర్ఎస్కు అనుబంధంగానే కొనసాగిస్తామని యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు కేటీఆర్ ఎదుట స్పష్టం చేశారు. గురువారం సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్కు వెళ్లి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావును కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి, సభ్యులు రామ్మూర్తి, మేడిపల్లి సంపత్, జంగిల్ రవీందర్, పెట్టం లక్షణ్, బండి రమేశ్, పానగంటి సత్తయ్య, ఇతర ఏరియాల నాయకులు కేటీఆర్తో ఇష్టాగోష్టిగా మాట్లాడి యూనియన్, పార్టీ పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని, యూనియన్లో తలెత్తిన అంశాలపై చర్చించారు. 45 నిమిషాలపాటు కేటీఆర్ టీబీజీకేఎస్ నాయకులు చెప్పిన విషయాలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. గతం మరిచి పోండి. పార్టీ, యూనియన్ మధ్య తలెత్తిన కమ్యూనికేషన్ వ్యత్యాసం మరిచి పోయి పార్టీ అండదండలతో యూనియన్ బలోపేతం చేసుకుందామని స్పష్టం చేశారు. పార్టీ యూనియన్కు అన్ని విషయాల్లో అండగా ఉంటుందన్నారు. ఈ నెల 24న జరిగే యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ హాజరై అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పారు. పార్టీ లేని యూనియన్ లేదన్నారు.
పార్టీ కింద అందరం కలిసి పనిచేస్తామని దిశానిర్దేశం చేశారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ అన్ని విధాల హక్కులు కల్పించడమే కాకుండా సంక్షేమానికి ప్రాధాన్యతిచ్చారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా ఐదు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపునకు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు కలిసికట్టుగా ప్రచారం చేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఐటీ రద్దు, గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటు ఎదుట ధర్నా చేసి కేంద్రానికి కార్మికుల సమస్యలు తీసుకెళ్తాతామని పేర్కొన్నారు. ఉద్యమ ద్రోహులను మరిచి, తిరిగి ఉద్యమకారులను పార్టీలోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు బడికెల సంపత్, గొర్ల సంతోష్, పొగాకు రమేశ్, అన్వేష్రెడ్డి, నూనె కొంరయ్య, రత్నాకర్రెడ్డి, ఉత్తేజ్రెడ్డి, ముత్యాల రమేశ్ పాల్గొన్నారు.