మంచిర్యాల అర్బన్/జైనూర్, నవంబర్ 27 : వానకాలం 2021-22 సీఎంఆర్ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నా యక్ అన్నారు. టేకుమట్ల బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్, కుందారం అన్నపూర్ణ రైస్ మిల్, పౌనూరులోని సదాశివ రైస్ మిల్లులను ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 వానకాలానికి సంబంధించి ధాన్యం అలాట్మెంట్ ఆపేలా చూడాలని డీసీఎస్వోకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొనుగోలు కేం ద్రాల నుంచి వస్తున్న లారీల్లో కొందరు మిల్లర్లు కోతల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అన్లోడ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం కుందారంలోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కాంటా చేసిన బస్తాల మాయిశ్చర్ పరిశీలించగా 22 శాతం రావడంతో కేంద్రం నిర్వహకుడిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని, గోనె సంచులను కల్లాల వద్దకు ఇవ్వద్దన్నారు. ఏఈవో సర్టిఫికేషన్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయరాదని, ఏఈవోలు కల్లాల వద్దకు రాకుంటే వెంటనే సివిల్ సైప్లె శాఖ అధికారులు, జిల్లా వ్యవసాయాధికారికి సమాచారం అందించాలన్నారు. ఏఈవోలు తప్పకుండా కల్లాల వద్ద ఉండేలా చూడాలని డీఏవోను ఆదేశించారు. ఆయన వెంట సివిల్ సైప్లె సంస్థ డీఆర్పీ రామస్వామి తదితరులు ఉన్నారు.