నార్నూర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఏజెన్సీ దళితులను మోసం చేశారని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భరత్ చౌహన్ ( Bharat Chauhan ) ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మహాదాపూర్ గ్రామాన్ని ఆయన సందర్శించి దళితులు ( Dalits ) ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో నివాసముంటున్న ఎస్సీలకు కనీస సదుపాయాలు, ప్రభుత్వ ఫలాలు అందక దయనీయ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేక రైతు భరోసా పథకానికి దూరమవుతున్నారన్నారు. కనీసం సాగు చేసే భూములకు పహనీలు నిలిపివేయడంతో బ్యాంకు రుణాలు పొందలేని దుస్థితి నెలకొందని వాపోయారు.
రోడ్డు సౌకర్యం, తాగునీటి వసతి వంటివి లేక అవస్థలు పడుతున్న పట్టించుకునే నాథులేరన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతంలోని దళితుల గురించి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, బాలాజీ, రాజ్ కుమార్, అర్జున్, శుద్ధోధన్, నీల్ కంఠ్, రాందాస్, కైలాస్, చంద్రకాంత్ తదితరులున్నారు.