ఆసిఫాబాద్, జూన్ 11 : స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత దివ్యాంగుల్లో భరోసా కల్పించడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వెలకట్టలేనిది. 2014 సంవత్సరం ఎన్నికల సమయంలోనే ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ రూ.500 నుంచి రూ.1500 చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. మరోసారి 2018 సంవత్సరం ఎన్నికల్లో గెలిస్తే రూ.3,016 ప్రతినెలా ఇస్తామని చెప్పి ఇస్తున్నారు. తాజాగా మంచిర్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జూలై నుంచి రూ. 4,116 ఇస్తున్నట్లు ప్రకటించడంతో దివ్యాంగుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. సీఎం కేసీఆర్ హామీపై వికలాంగుల సమైక్య ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇస్లాంబిన్ హాసన్ ఇంటర్వ్యూ.
నమస్తే : కేసీఆర్ హామీలు నిలబెట్టుకుంటున్నారు. ఎలా ఫీలవుతున్నారు?
ఇస్లాం : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అప్పటి ప్రభుత్వాలు రూ.500 పింఛన్ ఇస్తే సరిపోయేవికాదు. పింఛన్లను పెంచుతామని బీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.200 నుంచి రూ.2016, వికలాంగులకు రూ.500 నుంచి రూ.3016 పెంచి అందిస్తున్నారు.
నమస్తే : హామీని నిలబెట్టుకోవడంపై మీ అభిప్రాయం.
ఇస్లాం : రెండోసారి ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని కేసీఆర్ ప్రకటించడంతో ఓట్ల కోసమే అని అందరు అభిప్రాయపడ్డారు. కొందరు మా మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రూ.3,016 అందజేయడంతో కేసీఆర్పై నమ్మకం పెరిగింది.
నమస్తే : దివ్యాంగుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలు ఏమిటి?
ఇస్లాం : సీఎం కేసీఆర్కు దివ్యాంగుల సంక్షేమంపై శ్రద్ధ ఎంత ఉన్నది అనడానికి తాజాగా పెంచిన పింఛనే నిదర్శనం. దివ్యాంగులు సీఎం కేసీఆర్ పాలనపై సంతృప్తికరంగా ఉన్నారు. ‘అమ్మకూడా అడగందే అన్నం పెట్టదు’ అనే సామెత ఉంది. కానీ.. సీఎం కేసీఆర్ వికలాంగులకు అడగకున్నా ఆర్థికసాయం అందిస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వాలకు దివ్యాంగులు ఎల్లప్పుడు అండగా నిలబడుతారు.
నమస్తే : సర్టిఫికెట్ల జారీ ఎలా ఉంది?
ఇస్లాం : దివ్యాంగుల సర్టిఫికెట్ల జారీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సదరం క్యాంపుల ద్వారా నిర్వహిస్తున్నారు. పారదర్శకంగా ఉండేందుకు ముందుగానే మీ సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ చేపడుతున్నారు. సర్టిఫికెట్ల జారీ విషయంతో పారదర్శకత ఉంది. గతంలో డబ్బులు ఇచ్చి కూడా అనర్హులు సర్టిఫికేట్లను తీసుకొచ్చి పెన్షన్ పొందారు. ప్రస్తుతం అలాంటి వారు లేరు. ఒకవేళ ఉన్న వారి సదరం సర్టిఫికేట్ గడువు ముగిస్తే ఆ తరువాత మాత్రం సదరం క్యాంపులో అర్హత సాధించడం సులభం కాదు.