మంచిర్యాల, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ రాక ఖరారైంది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో అధునాతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని 4న ఆయన ప్రారంభించనున్నారు. 9న మంచిర్యాలలోని కలెక్టరేట్తో పాటు బీఆర్ఎస్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసి, రూ.1658 కోట్లతో చేపట్టనున్న చెన్నూర్ ఎత్తిపోతల పథకం, మంచిర్యాల- అంతర్గాం బ్రిడ్జి, మందమర్రిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ, జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కాలేజీల శాశ్వత భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను చిరకాలం గుర్తుంచుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్, మంచిర్యాల జిల్లా వాసులకు తీపికబురు అందించారు. జూన్ 4న నిర్మల్, 9న మంచిర్యాల జిల్లాలకు రానున్నారు. ఆయాచోట్ల నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఆయా జిల్లాల్లో పాలన అంతా ఒకేచోట ఉండేలా వందల కోట్ల రూపాయలతో సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మిస్తున్నది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
తాజాగా దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పనులు పూర్తి చేసుకున్న నాలుగు కలెక్టరేట్(జూన్ 4న నిర్మల్, 6న నాగర్ కర్నూల్, 9న మంచిర్యాల, 12న గద్వాల) కార్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించారు. మంచిర్యాల- అంతర్గాం మధ్య గోదావరిపై బ్రిడ్జి, మందమర్రిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ, మంచిర్యాల మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలకు శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.1658 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి చెన్నూర్ నియోజకవర్గంలోని దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూర్ ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు నన్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆయా చోట్ల నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.