కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనం సిద్ధమైంది. ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. 22 ఎకరాల సువిశాల స్థలంలో రెండంతస్థుల్లో భవనం నిర్మించగా, 37 శాఖల సేవలు ఇక్కడ అందునున్నాయి. రూ. 52.20 కోట్లతో కార్పొరేట్ ఆఫీస్ను తలపించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యాలయ సముదాయాన్ని నిర్మించింది. కాగా, జిల్లాలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇదే రోజు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనుండగా, వీటితో పాటు ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు అంకురార్పణ చేయనున్నారు.
జిల్లా కేంద్రంలో సర్వాంగ సుందరంగా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందించేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అధునాత సౌకర్యాలు, సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ కార్యాలయం కార్పొరేట్ ఆఫీస్లా కనిపిస్తున్నది. ప్రతి శాఖకు ప్రత్యేక కార్యాలయం, సమావేశ మందిరాలు, భారీ చాంబర్లు, ప్రజల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పోడు భూముల పట్టాలను పంపిణీ చేసేందుకు ఈనెల 30న జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాలమైన కలెక్టరేట్
జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని రూ. 52.20 కోట్లతో నిర్మించారు. 22 ఎకరాల స్థలంలో 1.39 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ-2 భవనంగా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ మొదటి, రెండో అంతస్థులో మొత్తం 88 వరకు గదులు ఉన్నాయి. అత్యాధునిక హంగులతో విశాలమైన గదులు, వెలుతురు వచ్చేలా సుందరంగా నిర్మించారు. ఆకట్టుకునేలా ఆకృతిలో వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటుచేసి మొక్కలు నాటారు. చుట్టూ తారు రోడ్లు వేశారు. భవనం ఎదుట భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు.
అన్ని శాఖలు.. ఒకే సముదాయం
సమీకృత కలెక్టరేట్లో సుమారు 37 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు అందనున్నాయి. ఇప్పటికే ఆయా శాఖలకు గదులను కేటాయించారు. కాన్ఫరెన్స్ హాల్, వీఐపీల కోసం ప్రత్యేక గదులు, భోజన శాల, ఉద్యోగుల విశ్రాంతి గదులు, సమావేశ గదులు, ఏటీ ఎం, పోస్టాఫీసు, మహిళా ఉద్యోగుల పిల్లల ఆలన కో సం ప్రత్యేక గదులు, రికార్డులు భద్రపరిచే గదులు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. భవనం వెనుక వైపు అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఇతర జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక గృహసముదాయాలను నిర్మించారు.
ఆహ్లాదకర వాతావరణంలో…
కలెక్టరేట్ను అహ్లదకర వాతావరణంలో నిర్మించారు. విశాలమైన గేటు, కార్యాలయం చుట్టూ తారు రోడ్లు, ఇరువైపులా ఆకట్టుకునేలా మొక్కలను నాటారు. కార్యాలయం పరిసరాలు పచ్చదనం, పూల మొక్కలతో ఆకట్టుకునేలా పర్యావరణ హితంగా ఉంది. కార్యాలయం ఎదుట, మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. కార్యాలయం లోపల గార్డెనింగ్, వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. భవనం లోపల, బయట దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో వంద శాతం పనులు పూర్తిచేసేలా అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.