మిర్యాలగూడ ;నవంబర్ 30న గుద్దుడు గుద్దితే.. పోలింగ్ బాక్సులు పగిలిపోవాలి.. విపక్షాల ఓటమి ఖాయం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చోటనే రైతుబంధు, ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేయడంతో ఈ రోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు.. మొనగాళ్లు నా తెలంగాణ రైతులు అని కొనియాడారు. మంగళవారం హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సైదిరెడ్డి, భాస్కర్రావు, రవీందర్నాయక్లకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
“వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాత రెండవ స్థానంలో తెలంగాణ ఉన్నది., లిఫ్ట్లు పూర్తయితే 4 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి మొదటి స్థానంలో నిలుస్తాం. రైతు బంధు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా..? రైతు బంధు వద్దనే పార్టీలు కావాలా..? ప్రజలు ఆలోచన చేయాలి. మూడు గంటల కరెంటు అనేటోడు అసలు ఎక్కడన్న పొలం దున్నిండా..? ఎయిర్ కండీషన్లో ఉండేటోడు ధరణి తీసేస్తాం అంటున్నడు. ఎద్దు.. ఎవుసం లేనోడికి రైతుల బాధలు ఏం తెలుసు.? కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అవుతామంటూ మాయమాటలు చెప్పి గోల్మాల్ చేసి.. ఓట్లు అడుగుతున్నరు. అసలు ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. పదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు.. శాంతియుతంగా రాష్ట్రం పురోగమిస్తున్నది. కాంగ్రెస్ దుర్మార్గులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఓటు. కొందరు నాయకులు కళ్లముందు జరిగిన చరిత్రను వక్రీకరిస్తున్నారు.
యువత ఏది నిజమో తెలుసుకున్న తర్వాతనే ఓటు వేయాలి. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి పార్టీ చరిత్ర, వైఖరి ప్రజల పట్ల వాటి దృక్ఫథం ఏమిటనేది ఆలోచన చేయాలి”అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.