బోథ్, డిసెంబర్ 13 : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికే సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఈశ్వరయ్య అన్నారు. మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం ఆవరణలో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రాంతాల వారీగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అధిక బిల్లులు, విద్యుత్ లైన్లలో అవాంతరాలు, కనెక్షన్లు, తదితర సమస్యలుంటే సదస్సులో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. బోథ్ మండలానికి చెందిన 30 మంది, ఇచ్చోడకు చెందిన ఏడుగురు, నేరడిగొండకు చెందిన ఒకరు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు బీ అశోక్, ఎల్ కిషన్, ఎస్ భూమారెడ్డి, ఎస్ఈ సంపత్కుమార్, డీఈఈ హరికృష్ణ, ఏడీఈ సుబ్రహ్మణ్యం, ఏఈఈలు, సిబ్బంది పాల్గొన్నారు. బోథ్, సొనాలలో స్తంభాలు ఏర్పాటు చేయాలని సర్పంచ్లు సురేందర్యాదవ్, సదానందం దరఖాస్తులు సమర్పించారు.