ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 6 : పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సిబ్బందిని సెల్ఫోన్లతో అనుమతించవద్దని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి, ఎస్ఆర్ డీజీ, ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల్లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడలోని పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష మొదలు కాకముందే సిబ్బంది సెల్ఫోన్లను బయట ఉంచేలా చూడాలని ఆదేశించారు. ఒకటో పట్టణ సీఐ కే సత్యనారాయణ, మావల ఎస్ఐలు విష్ణువర్ధన్, ఇసాక్ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 6 : నిర్మల్ జిల్లాలోని పలు పదోతరగతి పరీక్షా కేంద్రాలు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, డీఈవో రవీందర్ రెడ్డి, ఆర్జేడీ (ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు) సత్యనారాయణ రెడ్డి గురువారం తనిఖీ చేశారు. పట్టణంలోని విన్నర్స్ ఉన్నత పాఠశాల, ఈద్గాం ప్రభుత్వ ఉన్నత ఆశ్రమ పాఠశాల, రవి ఉన్నత పాఠశాలల్లో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను అడిగితెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలను పరిశీలించారు.