కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు మహారాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. కొందరైతే అడవుల్లో మేతకు వెళ్లిన పశువులను సైతం దొంగతనంగా తీసుకొచ్చి వాహనాల ద్వారా సరిహద్దులు దాటిస్తుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఇక వాహనాల్లో కిక్కిరిసి ఎక్కించడం వల్ల ఊపిరాడక అనేక మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి.
రాత్రి వేళల్లో తరలింపు
మహారాష్ట్ర-సిర్పూర్-టీ అంతర్రాష్ట్ర రహదారి మీదుగా సిర్పూర్-టీ, కౌటాల, గూడెం, చింతలమానేపల్లి, పెంచికల్పేట్, కడంబా, కాగజ్నగర్ క్రాస్రోడ్డు మీదుగా, వాంకిడి నుంచి ఆసిఫాబాద్ మీదుగా హైదరాబాద్.. కరీంనగర్ తదితర పట్టణాలకు పశువులను కంటెయినర్లలో తరలిస్తున్నారు. జిల్లాలోని వాంకిడి, కౌటాల, జైనూర్, సిర్పూర్ మండలాల్లోని పశువుల సంతల్లో, మహారాష్ట్రలోని గోయగాంలోని వారసంతలో దళారులు పశువులను కొనుగోలు చేసి రాత్రి వేళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.
సిర్పూర్-టీ నుంచి కాగజ్నరగ్ వరకు, రెబ్బెన నుంచి మంచిర్యాల జిల్లా దాటేవరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని దందా సాగిస్తున్నారు. తరలింపు సమయంలో పోలీసులు తనిఖీల విషయాన్ని ఏజెంట్లు దళారులకు అందిస్తుంటారు. దొంగదారుల్లో పశువులను పట్టణాలకు తరలిస్తుంటారు. జిల్లాలో రెండు మూడు రోజులకో చోట ఈ ఘటన వెలుగుచూస్తున్నది. పోలీసులు ఎంత నిఘా పెంచినా అడ్డదారులు వెతుకుతున్న స్మగ్లరు తమ దందాను కొనసాగిస్తునే ఉన్నారు. పోలీసుల నిఘా పెరిగినప్పుడు, ఎన్నికల సమయాల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసినవంటి సందర్భాల్లో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాలను పట్టుకుంటున్నారు.
కంటెయినర్లలో తరలింపు..
గతంలో వ్యాన్లు, ట్రక్కులు, లారీల్లో పశువులను అక్రమంగా తరలించిన స్మగ్లరు ఇప్పుడు కంటెయినర్లు వాడుతున్నారు. పరిమితికి మించి కంటెయినర్లలో కిక్కిరిసి ఎక్కించడం వల్ల మూగ జీవాలు ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి. నెల క్రితం చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడు పశువుల వాహనాలను పోలీసులు పట్టుకోగా, ఆ వాహనాల్లో 45 పశువులను తరలిస్తున్నటు గుర్తించారు. పరిమితికి మించి ఒక్కో వాహనంలో 15 పశువులను తరలిస్తుండడంతో తొమ్మిది పశువులు ఊపిరాడక చనిపోయాయి.
మరో పది పశువుల కాళ్లు విరిగిపోయాయి. పట్టుబడిన వాహనాలను సీజ్చేసిన పోలీసులు అక్రమంగా పశువులను తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల రెబ్బెనలో పట్టుబడ్డ కంటెయినర్లో 24 పశువులను ఎక్కించగా, అందులో 9 మృత్యువాత పడ్డాయి. రెబ్బెనలోని ఏవో బ్రిడ్డి సమీపంలోని అడవిలో చనిపోయిన పశువులను పడేసేందుకు కంటెయినర్ని ఆపగా, అదే సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు గమనించి వాహనాన్నిపట్టుకున్నారు.
కంటెయినర్లలో ఎంత క్రూరంగా జీవాలను తరలిస్తున్నారనేదానికి ఈ ఘటనే నిదర్శనం. అలాగే ఇటీవల వాంకిడి టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పశువులను తరలిస్తున్న కంటెయినర్ను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా.. ఈ నెల 7న గూడెం చెక్పోస్టు వద్ద 27 ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళ్లతో కట్టేసి కిక్కిరిసి తరలిస్తుండడంతో పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి.