రామగుండం ఫర్టిలైజర్సిటీ, జూన్ 11 : అరెస్ట్ అక్రమమంటూ నిరసన తెలిపిన రామగుండం, మంథని మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ, వనజతోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులపై గురువారం గోదావరిఖని వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ అరెస్ట్ విషయంలో ఈ నెల 9న పార్టీ కార్యకర్తలతో కలిసి ఇల్లందు గెస్ట్హౌస్ ఎదురుగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం మార్గంలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
అయితే నాయకులు, కార్యకర్తలు శాంతికి భంగం కలింగించారని, నిర్బంధించారని, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం ఏర్పరిచారని బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ వీ వెంకటేశ్ ఫిర్యాదుతో వన్టౌన్ పోలీస్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కోరుకంటి చందర్ ఆగ్రహించారు. సీపీని కలిసేందుకు వెళ్తున్న తమను, తమ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని కేసునమోదు చేయడం ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. శాంతియుతంగా తాము వస్తే తమపై కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. రానున్న రోజుల్లో ప్రజస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు.