ఆసిఫాబాద్: పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్లో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ రాల్రాజ్, ఎస్పీ వైవీఎస్ సుధీంద్రతో కలసి అమరవీరులకు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో అన్ని ఉద్యోగాల కంటే పోలీస్ ఉద్యోగం ఎంతో గొప్పదన్నారు. 24 గంటల పాటు విధులు నిర్వహించేది కేవలం పోలీసులేనని అన్నారు. పోలీసుల అమరుల త్యాగాలు మరువలేనివని వెల్లడించారు.
కలెక్టర్ రాల్రాజ్ మాట్లాడుతూ పోలీసులు విధులు నిర్వహించడంతోనే ప్రజలు శాంతియుతంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎస్పీ సుధీంద్ర మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ఈ సంవత్సరం 377 మంది ప్రాణత్యాగం చేశారన్నారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసు కుటుంబాల సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శేఖర్బాబు, శ్రీనివాస్, చంద్రశేఖర్, ప్రతాప్, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.