మంచిర్యాల, జూన్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “తెలంగాణ రావాలే.. నా కొడుకుల్లాంటి పిల్లలకు ఉద్యోగాలు రావాలే.. పక్కనున్న గోదారి నుంచి మా ఊరికి నీళ్లు రావాలే.. అభివృద్ధి పనులకు నీళ్లు కావాలే..” ఇవన్ని కావాలంటే నేను సచ్చినా మంచిదే.. ఇది తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న దెయ్యాల మల్లయ్య చివరి మాట. ఇంట్లో ఈ మాటలు చెప్పి బయటికి వెళ్లిన మల్లయ్య గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే మల్లయ్య, ఎక్కడ మీటింగ్, రాస్తారోకో జరిగినా పోయేటోడు. ఊరిలో కులం పెద్దమనిషిగా ఉండి ‘తెలంగాణ పోచమ్మ బోనాల’ పేరిట ఉద్యమ సమయంలో మల్లయ్య తీసిన రాస్తారోకో చరిత్రలో నిలిచిపోయింది. ఇందారం పక్కనున్న రామారావుపేట చెరువు కట్ట నుంచి మొదలుపెడితే ఇందారం క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అంత భారీ రాస్తారోకోలో కీలకంగా వ్యవహరించిన మల్లయ్య.. ఏం చేసినా.. ఎంత కొట్లాడినా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తలేదని గుబులు చెంది సెప్టెంబర్ 31, 2011న ఆత్మబలిదానం చేసుకున్నాడు.
మల్లయ్య కలలు గన్న విధంగానే ఈ రోజు బంగారు తెలంగాణ సాకారం అవుతుందంటున్నారు ఆ కుటుంబ సభ్యులు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, మా ఊరిలోనూ చాలా అభివృద్ధి జరిగిందని చెబుతున్నారు. కలలో కూడా ఊహించని విధంగా మా ఊర చెరువు కట్ట మీద డబుల్ రోడ్డు వేశారని, చెరువులో పూడిక తీశారంటున్నారు. పక్కనే గోదారి ఉన్న ఒకప్పుడు గుక్కెడు నీటి కోసం అల్లాడిన మా ఊరి బోర్లలో ఈ రోజు పుష్కలమైన నీరు ఉబికివస్తుందన్నారు. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వ పుణ్యమే అంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మల్లయ్య కుటుంబాన్ని గుర్తించి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. ఆ డబ్బుతో మల్లయ్య పెద్దకొడుకు రమేశ్ డెయిరీ ఫామ్ పెట్టుకొని వ్యాపారం చేస్తూ రెండో చేతులా సంపాదిస్తున్నాడు. చిన్న కొడుకు సంపత్ చదువుకున్నవాడు కావడంతో ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం ఇచ్చింది. ఇద్దరు కొడుకులు జీవితంలో మంచిగా స్థిరపడ్డారు. మా ఆయన లేని లోటు లేకుండా ప్రభుత్వం సాయపడింది. ఇప్పుడు ఆయన బతికి ఉంటే సంతోషపడే వాడు అంటున్నారు అమరుడు మల్లయ్య భార్య.
మాది జైపూర్ మండలం లోని రామారావుపేట గ్రామం. మా నాన్న తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ రోజు ఆయన లేకున్నా నన్ను మాత్రం నిలబెట్టిండు. తెలంగాణ సర్కార్ ఇచ్చిన రూ.10 లక్షలతో డెయిరీ వ్యాపారం చేస్తున్నా. నా కుటుంబాన్ని అమ్మను ఏ లోటు లేకుండా చూసుకో గలుగుతున్నా అంటే దానికి కారణం ఆయనే. మా కుటుంబాన్ని గుర్తించి ఆదుకున్న తెలంగాణ సర్కార్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు. – రమేశ్, మల్లయ్య పెద్ద కొడుకు
మా మల్లయ్య ఎప్పుడు చూసినా తెలంగాణ గురించే ఆలోచించేటోడు. ఎక్కడ మీటింగ్ అంటే పని పక్కన పెట్టి మరీ పోయేటోడు. నాలుగైదు సార్లు హైదరాబాద్ కూడా పోయి వచ్చిండు. బోనాల పండుగ చేసి రాస్తారోకో చేస్తే మంచి పేరు వచ్చింది. ఆయన చనిపోయాక తెలంగాణ సర్కారు మా కుటుంబాన్ని ఆదుకున్నది. నా ఇద్దరు కొడుకులు బతికేందుకు దారి చూపించింది.
– మల్లమ్మ, మల్లయ్య భార్య