ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలు నిలిపోయేవి. ఆదివాసీ గ్రామాలకు వాహనాలు, అంబులెన్స్లు రాకపోవడంతో గర్భిణులు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలకు 13 బీటీ రోడ్లను మంజూరు చేసింది. రూ.30 కోట్లతో 37.8 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాలు జరుగనున్నాయి. ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలుగనుండడంతో గిరిజన గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని రాజులవాడీ-కరంజిరోడ్డు. రాజలవాడీకి చెందిన గిరిజనులు తమ పనుల కోసం కరంజికి మూడు కిలోమీటర్లు రావాలి. ఆటోలు, సొంత వాహనాల్లో రాకపోకలు సాగిస్తారు. రోడ్డు మధ్యలో నుంచి వాగు ప్రవాహం ఉండడంతో వర్షాకాలంలో భారీగా నీరు ప్రవహించి రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి రూ.2.40 కోట్లు మంజూరు చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో త్వరలో రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఫలితంగా ఏడాది పొడవునా రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి మంజూరు కావడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, సెప్టెంబరు 7(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో మోస్తరు వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లడం, రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రైతులు వ్యవసాయ పనులకు వెళ్లలేని పరిస్థితి. వ్యాధుల నివారణలో భాగంగా వైద్యబృందా లు వాగులు దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. గర్భిణుల ప్రసవానికి దవాఖానకు వెళ్లాలంటే అంబులెన్స్లు, ఇతర వాహనాలు రావడానికి అవకాశం లేదు. స్థానికులు మంచాలపై గర్భిణులను ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగంగా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందు లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఆదివాసీ గూడేలు, తండాలకు రవాణా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మట్టి రోడ్లు ఉన్న గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లను నిర్మించడానికి అవసరమైన నిధులు మంజూరు చేసింది. గిరిజన గ్రామాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బీటీ రోడ్లు రానున్నాయి. సర్కారు నిధులు మంజూరు చేయడంతో ప్రజలు ఏడాది పొడువునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించనున్నారు.
ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మించనున్న బీటీ రోడ్లకు రూ.30 కోట్లు మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా 37.8 కిలోమీటర్లు గల 13 రోడ్లను నిర్మించనున్నారు. బోథ్ నియోజకవర్గంలో బజార్హత్నూర్ మండలం టెంబి నుంచి హర్కాయి వరకు నాలుగు కిలోమీటర్ల రహదారికి రూ.4 కోట్లు, ఇచ్చోడ మండలం సొంపల్లి నుంచి సిరికొండ వరకు మూడు కిలోమీటర్లకు రూ.2.30 కోట్లు, గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ నుంచి రాంనగర్ వరకు మూడు కిలోమీటర్లకు రూ.2.40 కోట్లు, నేరడిగొండ మండలం కొరిటికల్ నుంచి లింగట్ల వరకు 1.5 కిలోమీటర్లకు రూ.1.10 కోట్లు, భీంపూర్ మండలం బెల్లారి నుంచి రాంపూర్ వరకు రెండు కిలోమీటర్లకు రూ.1.60 కోట్లు, ఇచ్చోడ జాతీయ రహదారి నుంచి దుబార్పెట వరకు 2 కిలోమీటర్లకు రూ.1.60 కోట్లు, తాంసి మండలం బండల నాగాపూర్ నుంచి వడ్డాడి ఎక్స్రోడ్ వరకు రెండు కిలోమీటర్ల రహదారికి రూ.1.60 కోట్లు, భీంపూర్ మండలం కరంజి నుంచి రాజులవాడీ వరకు మూడు కిలోమీటర్లకు రూ.2.40 కోట్లు మంజూరు చేసింది. ఖానాపూర్ నియోజకవర్గంలో ఇంద్రవెల్లి మండలం మామిడిగూడ నుంచి హర్కాపూర్ వరకు 4.3 కిలోమీటర్లకు రూ.3.5 కోట్లు, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ రూరల్ మండలం రాములగూడ నుంచి మామిడిగూడ వరకు ఆరు కిలోమీటర్లకు రూ.4.90 కోట్లు, గుండంలొద్ది నుంచి చించూఘాట్ వరకు ఐదు కిలోమీటర్లకు రూ.4 కోట్లు, కంచ్కింటి నుంచి చిట్యాల్బోరి వరకు కిలోమీటర్లకు రూ.80 లక్షలు, బేల మండలం సైద్పూర్ నుంచి దుబ్బగూడ వరకు కిలోమీటరుకు రూ.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.
మహారాష్ట్ర సరిహద్దున మా గ్రామం ఉంది. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతాం. వ్యవసాయ, ఇతర పనులకు పోవాలంటే మట్టిరోడ్డుపై ప్రయాణం చేయాలి. వానకాలంలో రోడ్డు పాడై బాగా తకిలీబు అవుతది. గ్రామంలో ఎవరైనా ఆరోగ్యం బాగా లేకపోతే దవాఖానకు పోదామంటే ఆటోలు, అంబులెన్స్లు రావు. వాగు పొంగి రాకపోకలు నిలిచిపోతాయి. ప్రభుత్వం మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మంజూరు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయవచ్చు.
– మడావి దావు, రాజులవాడి, భీంపూర్ మండలం
కరంజి(టీ) పంచాయతీలో మా గ్రామం గుట్టలమధ్య ఉంటుంది. మా అవసరాల కోసం రోజు కరంజికి పోవాల్సి వస్తోంది. మూడు కిలోమీటర్లు నడిచి, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా మట్టిరోడ్డుపై ప్రయాణం కొనసాగిస్తున్నాం. రోడ్డు మధ్యలో వాగు ఉంది. వానకాలంలో రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రోడ్డంతా బురదమయంగా మారడంతోపాటు వాగు దాటనివ్వదు. దీంతో రాకపోకలు నిలిచిపోతాయి. బీటీ రోడ్డు నిర్మాణానికి ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం రోడ్డు మంజూరు చేయడం సంతోషంగా ఉంది.
– సోంజీ మడావి, గిరిజన రైతు,
రాజులవాడి, భీంపూర్ మండలం