ఇచ్చోడ, డిసెంబర్ 26 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సిరిచెల్మ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం వానోలే ఈశ్వర్(32)ను ఇద్దరు వ్యక్తులు గొడ్డలి, కత్తులతో వెంబడించి మరీ దారుణ హత్య చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన లక్ష్మిబాయికి కేదోబా, పాండ్రంగ్ కుమారులు. ఈమె భర్త రామ్జీ పదేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో పెద్ద కుమారుడు కేదోబా(రిటైర్డ్ టీచర్) నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు పాండ్ రంగ్ కూడా ఇచ్చోడ మండలంలోని ఏడో నంబర్లో ఉంటున్నాడు. వీరి తల్లి పేరిట జాతీయ రహదారిని అనుకొని ఏడో నంబర్లో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇద్దరు కుమారులకు చెరో ఎకరం చొప్పున పంచి ఇచ్చింది. మిగతా ఎకరం తన పేరిట ఉంచుకున్నది. లక్ష్మీబాయి పెద్ద కుమారుడి వద్దనే ఉంటున్నది. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం కేదోబా కుమారుడు వానోలే ఈశ్వర్ పేరిట ఎకరం భూమి కూడా పట్టా చేసింది. అప్పటి నుంచి ఈశ్వర్కు పాండ్ రంగ్, ఆయన కుమారుడు సూర్యకాంత్తో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పెద్దల వద్ద పంచాయతీలు కూడా జరిగాయి. ఈ క్రమంలో ఈశ్వర్పై పాండ్ రంగ్, అతని కుమారుడు సూర్యకాంత్ పగ పెంచుకున్నారు. పథకం ప్రకారం వానోలే ఈశ్వర్ను మంగళవారం ఉదయం పాండురంగ్, సూర్యకాంత్ కలిసి సిరిచెల్మ చౌరస్తాలో వెంబడించి కత్తులు, గొడ్డలితో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని ఈశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. పాండ్ రంగ్, సూర్యకాంత్ పారిపోగా.. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈశ్వర్ భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈశ్వర్కు నాలుగేండ్ల కూతురు ఉంది.