ఆదిలాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటుందని, ఈ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబీ శ్రేణులు ఓటమితో నిరాశ చెందకుండా అత్మైస్థెర్యంతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ స్థానాల్లో బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చిందని, ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోకసభతోపాటు స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు ముగిసిన అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు వేసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి బలోపేతం చేస్తామని సూచించారు.
అందరితో చర్చించి అభ్యర్థుల ప్రకటన
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమి గల కారణాలను విశ్లేషించుకుని, లోపాలను సవరించుకుని ముందుకు పోదామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తెలంగాణ ఎంపీల గెలుపు ఆవశ్యకతను వివరించాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీయే అని తెలుపాలని పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించడానికి గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విషయాన్ని ప్రజలు వివరించాలని సూచించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను ఇచ్చిందని, హామీల పుస్తకాన్ని అందరికీ అందజేస్తామని, వాటిని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల గ్లోబల్ ప్రచారాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని, పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని ప్రజలకు వివిరించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ స్వీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.