సారంగాపూర్, జనవరి 28 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరిస్తే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను విస్తరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మాత్యులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్రలో గల అప్పారావుపేట్, శివిని, కోస్మేట్, ఇస్లాపూర్, హిమాయత్నగర్ గ్రామాల్లో పర్యటించారు. అనంతరం స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో రైతుబంధు పథకం ద్వారా రెండు పంటలకు ఎకరాకు రూ. 10 వేలు, రైతు ఏ విధంగా మరణించినా బీమా ద్వారా రూ. 5 లక్షలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడ బిడ్డలకు రూ. లక్షా 116, మిషన్భగీరథ ద్వారా ప్రజలకు శుద్ధమైన నీరు, మిషన్కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, ఆసరా పింఛన్లు, భూమి ఉన్న పేదలకు ఇండ్లు నిర్మించుకోవడం కోసం రూ.3 లక్షలు, మన ఊరు- మనబడి ద్వారా పాఠశాలల అభివృద్ధి చేయడం, పండుగలకు బట్టలు అందించడం, విద్యార్థులకు సన్నన్నం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి పథకాలు మహారాష్ట్రలో ఉన్నాయా అంటూ అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పారీన్టి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్లం చేశారు. వచ్చే నెల 5న నాందేడ్లో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు స్వర్ణ గ్రామంలో లక్ష్మీనరసింహ ఇండస్ట్రియల్ రైస్మిల్ను ప్రారంభించారు. అలాగే అప్పారావుపేట్- నిర్మల్ నైట్హాల్ బస్సును ప్రారంభించారు. మంత్రికి అప్పారావుపేట్లో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం మహారాష్ట్రలోని శివాలయాలు, అయ్యప్ప దేవాలయాల్లో మంత్రి పూజలు చేశారు. మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ మాధవరావు, హిమాయత్నగర్ జడ్పీటీసీ సూర్యకాంత్, మహారాష్ట్ర సర్పంచ్లు షేక్ అబ్దుల్ రబ్, కపిల్ ఆడే, సత్యనారాయణ పూగుల్వార్, సుధాకర్, ఎంపీటీసీ భోజారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మం డల కన్వీనర్ మధుకర్, నాయకులు వడ్డేరాజేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, భూమేష్, దత్తురాం, మాయారాం, నర్సారెడ్డి, ఉట్లరాజేశ్వర్ పాల్గొన్నారు.
నాందేడ్లో సభా స్థలం పరిశీలన
ఎదులాపురం, జనవరి 28 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని విస్తరించడంలో భాగంగా వచ్చేనెల(తేదీ ఖరారు కాలేదు)లో నాందేడ్లో నిర్వహించబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాట్లను శనివారం శ్రేణు లు పరిశీలించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ న్న, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జహీరాబాద్ ఎంపీ బీవీ పటేల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్షిండే, ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడాం నగేశ్తో స్థానిక నేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లా ముఖ్యనేతలు అక్కడే పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో నాయకలను కలిసి సీఎం కేసీఆర్ పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. సభ ఏర్పాట్ల కోసం నాయకులు పలు సూచనలు చేశారు.