వేమనపల్లి, ఏప్రిల్ 14 : కార్యకర్తలు, నాయకులు సైనికుల వలే పనిచేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం వేమమనపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావునోట్లో తలకాయపెట్టి తెలంగాణను సాధించారని, పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపారని కొనియాడారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారని, ప్రధానంగా రైతుల కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, 24 గంటల ఉచిత కరంట్ అందించారని, రైతుబంధు, రైతుబీమాతో అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ప్రజలకు మన సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. నాలుగు నెలలు గడిచినా ‘ఆరు గ్యారెంటీల’ ఊసెత్తడం లేదని, ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారని, ప్రతి ఒక్కరూ కారు గెలుపుకోసం కృషి చేయాలని కోరారు.
పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. వేమనపల్లి మండల అభివృద్ధిని గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మండలాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించి ఆదర్శంగా నిలిపానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరిపై తప్పుడు కేసులు పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్రావు, ఎంపీపీ కోలి స్వర్ణలత, వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, ఎంపీటీసీ దాగామ బాపు, సింగిల్ విండో చైర్మన్కుబిడె వెంకటేశం, మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశం, మాజీ సర్పంచు కుబిడె మధు, మాజీ ఎంపీటీసీకోరెకొప్పుల అశోక్గౌడ్, పురాణం లక్ష్మీకాంత్ , మాజీ జడ్పీటీసీ తలండిభీమన్న, సంతోష్, రవి, రజాక్, మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్, దుర్గం చిన్నయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.