ఎదులాపురం, నవంబర్ 22 : ప్రజల నుంచి బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మిమోస పోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రణదీవేనగర్లో, భాగ్యనగర్, క్రాంతినగర్, తిలక్నగర్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్మేకు పట్టణ వాసులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ నాయకుడైన బండి సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
బండి సంజయ్ సైతం బీసీల సంక్షేమం గురించి ప్రచారాల్లో వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాల అసమర్థ పాలనతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దూరం చేయడానికి అనేక బృహత్తర పథకాలు అమలు చేశామని ,వాటిని దిగ్విజయంగా అమలు చేయడంతోనే ప్రజలు నుంచి విశేష స్పందన లభిస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజప్తి చేశారు. కార్యక్రమంలో మహిళా నాయకులు మంచికట్ల ఆశమ్మ, వార్డు కౌన్సిలర్లు కొండ మీనాగణేశ్, అశోక్ స్వామి, సంద నర్సింగ్, కోవ రవి, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, 600 మంది కార్యకర్తలు, పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ కార్యాలయంలో జోగు రామన్న వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్తపల్లి సంతోష్. ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు అశాంత్, నాయకులు గేడాం రాము, లీలావతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకులు భగత్ సంగీత, వందన తమ అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్, బీజేపీలో నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు. నియోజకవర్గంలో వేలాది మంది గులాబీ పార్టీలో చేరారని పార్టీ విజయానికి వారు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్లో మహిళలకు సరైన గౌరవం లేదని బీఆర్ఎస్లో చేరిన మహిళ నాయకురాళ్లు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసిన వారికి నాయకులు పట్టించుకోరని, అవసరాలకు వినియోగించుకొని పక్కన పెడుతారని బీజేపీ యువమోర్చా నాయకుడు సంతోష్ తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు అలాల అజయ్, దుర్గం శేఖర్, బుట్టి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.