తాండూర్ : ప్రతిపక్షాల పర్యటనలను చూసి భయపడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను ( BRS Leaders ) ముందస్తు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. తాండూర్ ( Tandur ) మండలంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ సతీష్, బీఆర్ఎస్ నాయకుడు క్రాంతికుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆదివారం అరెస్టు చేసి మాదారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దార్శనికతతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పర్యటనను అడ్డుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు.
ముందస్తు అరెస్టులతో గొంతునొక్కాలని చూడటం వారి నిరంకుశ పాలనకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పోలీసుల నిర్బంధాలతో, అక్రమ అరెస్టులతో ప్రభుత్వం కాలం వెళ్లదీయాలని చూస్తోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.