అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గులాబీ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ 23023 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేందర్ మూడో స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాలుగు సార్లు విజయం సాధించగా వరుసగా మూడుసార్లు గులాబీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. నియోజకవర్గం ప్రజలు మరోసారి అభివృద్ధికి పట్టం కట్టి బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్జాదవ్ను ఆదరించారు.
– ఆదిలాబాద్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించగా.. ఆదిలాబాద్లో బీజేపీ గెలుపొందింది. బోథ్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన బోథ్ నియోజకవర్గం గణనీయమైన అభివృద్ధి సాధించింది. విద్య, వైద్యం, వ్యవసాయ, రవాణా, ఇతర సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఇంటింటా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో నాయకులు, నియోజకవర్గ అభివృద్ధితోపాటు ప్రభుత్వం పథకాలను వివరించడంతో ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలిచారు.
2014లో నియోజకవర్గంలో మొదటిసారి బీఆర్ఎస్ విజయం సాధించగా.. 2014, 2018, 2023లో వరుసగా మూడోసారి గులాబీ పార్టీ జెండా ఎగిరింది. నవంబర్ 30న జరిగిన పోలింగ్లో బోథ్ నియోజకవర్గంలో 1,72, 397 ఓట్లు పోలవగా.. 82.93 పోలింగ్ శాతం నమోదైంది. ఆదిలాబాద్ జరిగిన కౌంటింగ్లో 22 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగగా.. ప్రతి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ అధిక్యం కనపర్చారు. బీఆర్ఎస్కు 76,297 ఓట్లు రాగా, బీజేపీకి 53,274 ఓట్లు, కాంగ్రెస్కు 32,426 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ 23,023 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్జాదవ్ను ప్రకటించారు. ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే పార్టీ నాయకులు పక్కా వ్యూహంతో ప్రచారం కొనసాగించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, నియోజకవర్గం ఇన్చార్జి మాజీ ఎంపీ నగేశ్, అభ్యర్థి అనిల్ జాదవ్ల సమన్వయంతో ప్రచారం కొనసాగింది. తొమ్మిది మండలాల్లో ర్యాలీలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. మండల, గ్రామస్థాయి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వం పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థి అనిల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను గెలిపించాలని కోరారు. ఇచ్చోడలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాగా వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ప్రచారంలో మొదటి నుంచి ముందంజలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు చివరి వరకు అదే తీరును కనపర్చారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ బీజేపీ అభ్యర్థి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్పై 23,023 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటి చేసిన రాథోడ్ బాపురావ్కు 61,125 ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సోయం బాపురావ్కు 54,639 ఓట్లు రాగా, రాథోడ్ బాపురావ్కు 6,486 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో అనిల్జాదవ్కు 76,297 ఓట్లు రాగా సోయం బాపురావ్కు 53,274 ఓట్లు వచ్చాయి. గతంలో కంటే ఈ ఎన్నికల్లో 15,172 ఓట్ల ఎక్కువగా వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సోయం బాపురావ్కు ఈ ఎన్నికల్లో గతంలో కంటే 1,365 ఓట్లు తక్కువగా వచ్చాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 44.2 శాతం, బీజేపీకీ 30.9 శాతం, కాంగ్రెస్కు 18.8 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ కంటే 14 శాతం ఓట్లు అధికంగా బీఆర్ఎస్కు వచ్చాయి.