కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అడుగడుగునా వారికి నీరాజనం పలుకుతున్నారు. బుధవారం వాంకిడి మండలం దాబా, మహాగాం, గోయగాం, రాజులగూడ, చిన్నుగూడ, మోకాసిగూడ, సోనాపూర్, దొడ్డిగూడ, చిచ్చుపల్లి, పునగూడ, మచ్చగూడ, రోహిణిగూడ, గణేశ్పూర్ గ్రామాలతో పాటు రెబ్బెన మండలం నవేగాం, వంకులం, రాంపూర్, రాళ్లపేట్ గ్రామాల్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. చింతలమానేపల్లి మండలం నందికొండ, కౌటాల మండలం గుండాయిపేట్ గ్రామాల్లో ఎమ్మెల్యే కోనప్ప ప్రచారం చేశారు.
ఈ పేదళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై అవగాహన కల్పిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల బూటకపు మాటలు నమ్మిమోసపోవద్దని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే వారికే పట్టం కట్టాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు ఎకరానికి రూ. 16 వేలు, పింఛన్లను రూ. 5 వేలకు పెంచడంతో పాటు మహిళలకు రూ. 3 వేల భృతిని అందిస్తుందన్నారు. కేసీఆర్ బీమా పథకంతో ప్రజలందరికీ ఇన్సూరెన్స్ కల్పిస్తామని, రూ. 400లకే గ్యాస్సిలిండర్లు అందిస్తామన్నారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇవ్వడంతో పాటు అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేస్తామని తెలిపారు. సాధించిన ప్రగతిని చూసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలిని పిలుపునిచ్చారు.