దండేపల్లి : ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమాషా చేస్తున్నాయని బీఆర్ఎస్( BRS ) రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ రావు ( Vijit Rao ) మండిపడ్డారు. ఎలాంటి తరుగు షరతులు లేకుండా రైతులు పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న, వరి పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ధాన్యానికి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు బస్తాకు 3 కిలోల చొప్పున కటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కాంట అయిన తర్వాత తరలించడానికి బ్యాగుకు రూ. రెండు చొప్పున ఇవ్వాలని లారీ యజమానులు అడుగుతున్నారని అన్నారు.

మొక్కజొన్న పంటను ఎకరానికి 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, 40 క్వింటాల్ల వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరిస్తానని, రైతులు నష్టపోకుండా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, పీఎసీఎస్ మాజీ వైస్ చైర్మన్ అక్కల రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.