ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మన పార్టీకి బలమని, గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్హాలులో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. 100 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 16 : రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి బలమని, గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్హాలులో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ గ్రామ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు గ్రామస్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించాలని, ప్రజలకు వివరించాలని సూచించారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. బీఆర్ఎస్లో 60 లక్షల మందికి సభ్యత్వం ఉన్నదని గుర్తు చేశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 400 రకాలకు పైగా సంక్షేమ పథకాలు చేపట్టారని, ప్రతి కుటుంబానికీ ఏదో విధంగా లబ్ధి చేకూరుతుందని, ఈ విషయాలనే పార్టీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని కోరారు. ఎవరికైనా మనస్పర్థలు ఉంటే వాటిని చర్చల ద్వారా తొలగించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించిందని, నిత్యం ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. జన్ధన్ ఖాతాల్లో ఒకొకరికి రూ. 15 లక్షలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ.. ఆపై మాట తప్పారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.
ఆత్మీయ సమ్మేళనం వేదికపై మంచిర్యాల పట్టణంలోని 20వ వార్డు ప్రజలు బీఆర్ఎస్లో చేరారు. వార్డు కౌన్సిలర్ అంకం నరేశ్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది చేరగా, ఎమ్మెల్యే దివాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సమ్మేళనంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, మార్కెట్ కమిటీచైర్మన్ పల్లె భూమేశ్, ఐసీడీఎస్ మాజీ ఆర్గనైజర్ అత్తి సరోజ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు గరిగంటి సరోజ, నాయకులు విజిత్రావు, తోట తిరుపతి, గోగుల రవీందర్రెడ్డి, ఖాజామియా, సందెల వెంకటేశ్, బొలిశెట్టి కిషన్, ఎర్రం తిరుపతి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ గడ్డపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయేనని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారని, పార్టీ ఏ పిలుపునిచ్చినా దానిని విజయవంతం చేస్తారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి కేంద్రంలోని బీజేపీ సర్కారు, కాంగ్రెస్ పార్టీ గజగజ వణికిపోతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణను చూసి ఆ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే ఆ రెండు పార్టీల నాయకులు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాలని చూసి దొరికిపోయారని, జైలుకు వెళ్లారని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓటుకునోటు కేసులో జైలు శిక్ష అనుభవించారని, ఇక వాళ్లు మాట్లాడే మాటలకు ఏమాత్రం విలువ ఉంటుందో తెలుసని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడమే పనిగా పెట్టుకున్నదని, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు, తదితర సంస్థలను ప్రైవేటీకరిస్తున్నదని మండిపడ్డారు. రైతుచట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ఉసురు పోసుకున్న మోదీని గద్దెదించాలని, బీజేపీని దేశంనుంచి కూకటి వేళ్లతో పారద్రోలాలని పిలుపునిచ్చారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మంచి మంచిర్యాల పేరు పోతుందని, బీజేపీకి ఓటేస్తే అంతా ప్రైవేటీకరిస్తారని వివరించారు. రెండురోజుల క్రితం మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని, ఆ సమావేశంలో మాట్లాడిన నాయకుల ప్రసంగాల్లో పసలేదని అన్నారు.