దండేపల్లి, ఫిబ్రవరి 18 : గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చాదాత్త వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలు ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో భాగంగా దేవతా మూర్తుల చిత్రపటాలను గుట్టపై ఉన్న సప్తాహ భజన మండపం వరకు సన్నాయి వాయిద్యాలతో తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి, విశ్వక్సేనారాధన, దీక్షాకంకణాధారణ పూజలు చేశారు. అనంతరం నిరంతర సప్తాహ భజనలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, ముఖ్య అర్చకులు రఘుస్వామి, సంపత్స్వామి, వేద పండితులు నారాయణశర్మ, అర్చకులు సురేశ్, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.