భీంపూర్, మార్చి 28 : సేవాభావం, క్రమశిక్షణ, క్రియాశీలకంగా పనిచేసే 60 లక్షల సభ్యత్వాలు గల ఏకైక పార్టీ బీఆర్ఎస్సే అని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని అంబుగాం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. బైక్ ర్యాలీ, డప్పు చప్పుళ్ల మధ్య గ్రామస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జాతిరత్నం కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కప్పర్లకు చెందిన 80 మంది బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ జయకేతనమే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్నాయని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారన్నారు. కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సారథ్యంలో ప్రగతి పథంలో రాష్ట్రం దూసుకెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్కుమార్, మండల కన్వీనర్ అరుణ్కుమార్, ఎంపీపీ సురుకుంటి మంజుల, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రమణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనంజయ్, సర్పంచ్లు తూర్పాబాయి, స్వప్న, గంగుల వెంకన్న, సదానందం, నాయకులు శ్రీధర్రెడ్డి, కంది గోవర్ధన్రెడ్డి, రఘు, సామ నాగారెడ్డి, యశ్వంత్ పాల్గొన్నారు.