బోథ్, మే 29 : బోథ్ మార్కెట్ యార్డుకు తక్షణమే లారీలను పంపిస్తానని, రైతులు ఆందోళన చెందవద్దని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసానిచ్చారు. శుక్రవారం బోథ్ మారెట్ యార్డును ఎమ్మెల్యే పరిశీలించారు. అకాల వర్షాలతో పడుతున్న ఇబ్బందులను జొన్న రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎకరానికి 10 క్వింటాళ్లే కొనుగోలు చేస్తున్నదని, అది కూడా పంటను తూకం వేసి తరలించడం లేదని, దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో రాత్రి, పగలు పడిగాపులు కాస్తూ ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు, రవాణా, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడీవో రమేశ్, పీఏసీఎస్ అధికారులు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు స్వామి, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సర్పంచ్లు రాజేందర్, రవీందర్, బాబులాల్, నాయకులు ఎలుక రాజు, నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, పట్టణాధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, వీడీసీ పోతన్న, రమణాగౌడ్, వార్డు మెంబర్ ప్రవీణ్, గంగమల్లు, రమణారెడ్డి, తదితరులు ఉన్నారు.
నేరడిగొండ, మే 29 : బీఆర్ఎస్ అండగా ఉంటుందని రైతులెవరూ ఆందోళన చెందొద్దని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలోని జొన్న, మక్క కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్లను సందర్శించారు. అకాల వర్షంతో పంటను కాపాడుకోలేక ఆందోళన చెందుతున్న రైతులతో మాట్లాడారు. లారీలు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలుపడంతో ఓనర్లతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి 10 లారీలు వచ్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారని, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వర్షంలో నీటి పాలయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అనంతరం కుమారి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతుల పంటలను నిల్వ చేసేందుకు సాత్ నంబర్లోని విజయలక్ష్మి జిన్నింగ్ మిల్లు యజమానితో మాట్లాడి జిన్నింగ్ను కేటాయించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ చిత్రు, మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రవీందర్ రెడ్డి, ప్రతాప్, సుజీల్, స్వామి, శ్రీధర్ రెడ్డి, రాజేందర్, సర్పంచ్ నీలిమ రవీందర్ ఉన్నారు.