బీజేపీ నాయకులు కేవలం మోసపూరిత మాటలకే పరిమితమయ్యారని, ప్రజా సంక్షేమం వారికి పట్టదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్, బేల మండలాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దండారీ చెక్కులను అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్ధన్ ఖాతాల్లో ప్రధాని మోదీ వేస్తానన్న రూ. 15 లక్షలపై సమాధానం చెప్పాలన్నారు. పేదలు, రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దేనని, అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 23 : బీజేపీ నాయకులవి కేవలం మోసపూరిత మాటలేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆదిలాబాద్ రూరల్, అర్బన్, మావల మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల జిల్లాలో పర్యటించి, పేదల సంక్షేమానికి ఏ హామీలు ఇచ్చారో తెలుపాలని, స్థానిక బీజేపీ నాయకులను ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి పేద కుటుంబాలను ఆదుకున్నదని గుర్తుచేశారు. అలాంటిది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం మాత్రమే బీజేపీ నాయకులు జిల్లాలు, రాష్ట్రంలో పర్యటిస్తున్నారని విమర్శించారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఎన్నికల్లో హామీలివ్వని అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. నల్లధనం వెలికి తీసి, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని బీజేపీ ప్రభుత్వం నమ్మబలికి మోసం చేయలేదా.. అని ప్రశ్నించారు. జిల్లాలోని సీసీఐ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం సొం త ఖర్చులతో తెరుస్తామన్నా అనుమతివ్వకుండా బడా వ్యాపారుల కోసం టెండర్ వేయలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, నల్లా రాజేశ్వర్, జగదీశ్, రమణ పాల్గొన్నారు.
బేలలో 92 మందికి చెక్కులు..
బేల మండల కేంద్రంలో 92 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రామన్న అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ విషయాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. మోసపూర్తి మాటలు చెబుతున్నారే తప్ప, ప్రజలకు ఇస్తామన్న సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రారంభించకపోవడం ఆ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి సారీ మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెడుతూ వారికి బాసటగా నిలస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రం గ్యాస్ధరలు పెంచడం, జీఎస్టీ అమలు, రైతులపై నల్లచట్టాలను ప్రయోగించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు. మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నదని మండిపడ్డారు. హామీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల ఉసేలేదని విమర్శించారు. అనంతరం 18 గ్రామాలకు దండారీ చెక్కులను సర్పంచులు, గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ఠాక్రె, నాయకులు సతీశ్ పవర్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, దేవన్న, మస్కే తేజ్రావు, వాడ్కర్ తేజ్రావు, సుదర్శన్, మంగేశ్ ఠాక్రే, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
కిశోర బాలికలకు న్యూట్రిషన్ కిట్స్..
బేల మండల కేంద్రంలోని గణేశ్ గార్డెన్లో 18 మంది కిశోర బాలికలకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ కిట్స్ను ఎమ్మెల్యే జోగు రామన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల ఆరోగ్యం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. అందులో భాగంగానే 11 నుంచి 14 ఏండ్ల బడి మానేసిన పిల్లలకు ప్రత్యేకంగా రక్తహీనత సమస్య తలెత్తకుండా హెల్త్ అండ్ న్యూట్రిషన్ కిట్స్ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, నాయకులు తన్వీర్ఖాన్, దేవన్న, సీడీపీవో వనిశ్రీ, సూపర్వైజర్ శృతి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.