మంచిర్యాల, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “తెలంగాణ రాక ముందు ఎట్లున్న చెన్నూర్ నియోజకవర్గం.. ఇప్పుడు ఎట్లున్నదో ఒకసారి ఆలోచించాలి. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని.. కేవలం ఐదేళ్లలో చేసి చూపినం. విప్ బాల్క సుమన్ చెన్నూర్ను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కు పోటీగా నిలుపుతున్నారు. ఇలాంటి దమ్మున్న నాయకుడిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపిస్తే నిధులు వరదలా పారుకుంటూ వస్తాయి. కేసీఆర్ దయతలచి ఆయనను మంత్రిని చేస్తే ప్రగతి పరుగులు పెడుతున్నది. రామకృష్ణాపూర్లో 4 వేల మందికి పట్టాలు ఇచ్చాం. ఇక 400 మందికి ఇచ్చుడు పెద్ద కష్టమేమీ కాదు. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఇప్పిస్తా. రూ.1,658 కోట్లతో చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. ఈ బాధ్యత మాదే. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే మందమర్రిలో రూ. 500 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం.” అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయా చోట్ల నిర్వహించిన రోడ్షో, బహిరంగ సభలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి ప్రసంగించారు.
గత పాలకులు చెన్నూర్ నియోజకవర్గా న్ని పట్టించుకోలేదని, 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని.. కేవలం ఐదేళ్లలో చేసి చూపించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, విప్ బాల్క సు మన్కే దక్కుతుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొనియాడారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. నియోజకవర్గంలో సుమారు రూ.313 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. క్యాతన్పల్లి పరిధిలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మందమర్రి మార్కెట్ సెంటర్లో జరిగిన రోడ్షో, రామకృష్ణాపూర్ ఠాగూర్ స్డేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విప్ బాల్క సుమన్ సమర్థ నాయకత్వంలో చెన్నూర్ నియోజకవర్గం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లతో పోటీ పడుతూ ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. మరోసారి సుమన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. సిద్దిపేట, సిరిసిల్లకంటే.. చెన్నూర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతారని చెప్పారు.
మందమర్రిని మున్సిపాలిటీ చేసుకుందాం..
మందమర్రిని డీ-నోటిఫై చేయించాలే. ఇక్కడ వెంటనే ఎన్నికలు పెట్టించాలే అంటే అది మన చే తుల్లో లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘మన చేతుల్లో ఉంటే ఇప్పటికే రెండుసార్లు ఎన్నికలు జరిగేవి. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ ఢి ల్లీలో ఉన్న మో దీ మనం ఎన్ని చెప్పినా వినడు.. ప్రజలకు పనికొచ్చే పనులు చెప్పినా వినడు.. మా సింగరేణి కార్మికులకు పనికి వచ్చే పని చెప్పినా వినడు. బొగ్గు గనులన్నీ అధానికి రాసిచ్చి సింగరేణిని నాశ నం చేయాలనే ఆలోచన తప్ప.. మోదీ మనసులో తెలంగాణ లేదు. అందుకే మీరంతా తమ్ముడు సు మన్, ఎంపీ వెంకటేశ్ నేతకానిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈసారి కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తది. మన ఎంపీలు గెలిస్తే రే పటి రోజున.. ఆ ఢిల్లీ జుట్టు మన చేతి లో పెట్టుకొని మందమర్రి మున్సిపాలిటీలో ఎన్నికలు పెట్టుకుం దాం.. సింగరేణిని కాపాడుకుందాం’ అని చెప్పారు.
ఎన్నో పనులు చేశాం..కడుపులో పెట్టి కాపాడుకుంటాం..
చెన్నూర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆడ బిడ్డల కోసం సమ్మక్క- సారలమ్మ భవన్లు, బతుకమ్మ గ్రౌండ్లు ఏర్పాటు చేసుకున్నామని, పట్టణాలు, మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పెట్టుకున్నామని, ఆర్వోబీలు, రెండు పడకల ఇండ్లు, ప్లే గ్రౌండ్లు, ఓపెన్ జిమ్లు ఇలా ఎన్నో చేశామన్నారు. ఇప్పుడే రూ.50 కోట్లతో టూరిజం ప్రమో ట్ చేసేలా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కేసీఆర్ అ ర్బన్ ఎకో పార్కుకు శంకుస్థాపన చేశామన్నారు. చె న్నూర్లో 100 పడకల ఆసుపత్రి, 50 పడకల మ తాశిశు సంరక్షణ ఆసుపత్రి కట్టుకున్నా.. చెన్నూర్ లో బస్ డిపో పెట్టుకున్నా… రామకృష్ణాపూర్లో ఆర్వోబీ కట్టుకున్నా.. తాగునీటి సమస్యకు వందల కోట్ల రూపాయల మిషన్ భగీరథతో తీర్చుకున్నా.. వాగులు, వంకలపై 18 బ్రిడ్జిలు కట్టుకున్నా.. నాలు గు వేల సింగరేణి పట్టాలు ఇచ్చుకున్నా.. కుందా రం, మందమర్రి, రామకృష్ణాపూర్లో కొత్తగా పీహెచ్సీలు కట్టుకున్నా.. .రామరావుపేట, కుమ్మరికుంటు, పెద్దచెరువు, బొక్కల గుట్ట, సుబ్బనపల్లి, ముదికుంట, టేకుమట్లలో చెక్డ్యామ్లు నిర్మించినా.. రైతు వేదికలు.. గ్రంథాలయాలు ఎన్నో పను లు చేసుకున్నా.. అవన్నీ సుమన్ హయాంలోనే జరిగాయన్నారు. అందుకే 60 ఏండ్లలో జరగని పని ని.. కేవలం ఐదేండ్లలో చేసిన ఘనత బాల్క సుమన్ది అంటూ కితాబిచ్చారు.. ఇన్ని రోజులు మి మ్ముల ఎైట్లెతే కడుపులోపెట్టి కాపాడుకున్నమో.. రా నున్న రోజుల్లోనూ అట్లనే కాపాడుకుంటామన్నా రు. నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో ముందుకు పోతామన్నారు.
‘చెన్నూర్ ఎత్తిపోతల’ పూర్తి చేసి నీళ్లిస్తాం..
రూ.1658 కోట్ల చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని సుమన్ నేతృత్వంలోనే పూర్తి చేసి.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎవరు ఎంత మొత్తుకున్నా.. ఎవరు ఎంత అరచి గీ పెట్టినా ఆ పని ఆగదన్నారు. తప్పకుండా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలోనే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటామని, ఇక్కడున్న రైతన్నలందరికీ ఆ నీరు అందిస్తామని చెప్పారు. రామకృష్ణాపూర్లో నాలుగు వేల మందికీ సింగరేణి పట్టాలు ఇచ్చామని, మిగిలిన కొందరు అర్హులకు సైతం వెంటనే సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పట్టాలు ఇప్పించే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. నాలుగువేల మందికి పట్టాలు ఇచ్చి, నాలుగు వందల మందికి ఇచ్చుడు పెద్ద కష్టమేమీ కాదన్నారు. చెన్నూర్ రెవెన్యూ డివిజన్ విషయంలో త్వరలోనే శుభవార్త వింటారన్నారు. అది కూడా సమన్ నేతృత్వంలోనే జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. కోటపల్లి మండలంలోని పారుపల్లిని, చెన్నూర్ మండలంలోని అస్నాద్ను మండలాలుగా ఏర్పాటు చేసుకుందామన్నారు. చెన్నూర్లోనే కాదు రాష్ట్రంలో ఎన్ని పనులు జరుగుతున్నయో ఒక్కసారి ఆలోచించాలన్నారు. 60 ఏండ్లు అధికారం ఇచ్చినా ఏం చేయని వారు.. ఢిల్లీలో ఫైరవీలు చేసినోళ్లు ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అని చెప్పే డైలాగ్లకు ఆగం కాకుండా ఆలోచనతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే మీ కండ్ల ముందే చరిత్ర ఉందన్నారు. పదేళ్ల క్రితం తెలంగాణ రాక ముందు ఎట్లున్న చెన్నూర్. ఇవాళ ఎట్లున్నదో ఆలోచించాలన్నారు.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో లాభం..
వరి పండించడంలో తెలంగాణ రాష్ట్రం పం జాబ్, హరియాణాను దాటేసిందని మంత్రి చెప్పా రు. కేసీఆర్ హయాంలో కట్టుకున్న ప్రాజెక్టులు, బా గు చేసుకున్న చెరువులతో పంజాబ్, హరియాణాకంటే మనం ఎంతో ముందుకెళ్లామన్నారు. కానీ అందరం వరి పంటకే పోతే.. భవిష్యత్తులో ఇ బ్బంది అయ్యే ప్రమాదం ఉంటది కాబట్టి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా కమర్షియల్ పంటలను రైతులు ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఆయిల్పామ్ను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంటను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మందమర్రిలో ప్రారంభించిన ఫ్యాక్టరీతో రైతులకు లాభం చేకూరుతుందన్నారు. నెలకు ఎకరాకు రూ.12 వేల చొప్పున సంవత్సరానికి దాదాపు రూ. 1.50 లక్షల ఆదాయం వస్తుందన్నారు. ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 1000 మందికి ఉపాధి దొరుకుందన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ వెంకటేశ్నేతకాని, ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, నారదాసు లక్ష్మణ్, టీబీజీకేఎస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్, చెన్నూర్ నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జోష్ నింపిన కేటీఆర్ ప్రసంగం..
మందమర్రి రోడ్ షోలో మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం జనంలో జోష్ నింపింది. మాట్లాడానికి ముందు “సుమన్ను గెలిపించుకుంటున్నారా.. మెజార్టీ ఎంతా.. అంటూ మంత్రి ప్రజలను ప్రశ్నించారు. జనం నుంచి 50 వేల మెజార్టీ అనే సమాధానం రాగా.. 50 వేలా.. అది సరిపోదు అన్నారు. దీనికి జనం లక్ష మెజార్టీ అంటూ హోరెత్తించారు. లక్షనా.. పక్కానా.. పక్కా లక్షా అనేటోళ్లు అందరూ కుడి చేయి లేపండి.. కారు గుర్తుకు ఓటు వేసుడు పక్కా.. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుడు పక్కా అనేటోళ్లు.. రెండు పిడికిళ్లు లేపండంటూ పిలుపునిచ్చారు. నా తమ్ముడు బాల్క సుమన్.. నాకు ఏం చెప్పాడంటే.. అన్న ఒక్క గంటలో ముగించేసి పంపిస్తా అన్నాడని.. తీరా ఇక్కడికి వచ్చాక అది ఒక్కటే.. ఇది ఒక్కటే అంటూ కోట్లాది రూపాయల పనులు ప్రారంభించుకున్నారన్నారు. బతుకమ్మ ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన నాకు మా ఆ బిడ్డలందరూ రాఖీ కట్టారు. అన్నా.. మా సుమనన్న మంచి పనులు చేస్తున్నడని చెప్పారని తెలిపారు. కేసీఆర్ సార్ మళ్లీ రావాలే.. మళ్లా ఆయన వస్తేనే రైతులు, మహిళలు, పేదలు బాగుంటరు అని చెప్పారని వివరించారు.
మా తమ్ముడు సుమన్ గురించి ఒక్క మాట
మా తమ్ముడు సుమన్..గురించి ఒక్క మాట.. ఈ తమ్ముడు నాకు 2006లో పరిచయం అయ్యాడు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నడు.. ఆ రోజు కాంగ్రెసోళ్లు తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పుడు సోనియా గాంధీ.. ఢిల్లీ అంతా రాజశేఖర్రెడ్డి మాయలో ఉండే. ఆ నాడు ఉద్యమాన్ని బుక్క పెడుతరు అనుకున్నప్పుడు కొంత మంది ఉస్మానియా విద్యార్థులను నా దగ్గరికి పిలుచుకున్నా.. ఏం చేద్దాం.. ఎట్లా చేద్దాం.. మీ ఆలోచనలు చెప్పమన్న. అందులో మెట్పల్లి పిల్లగాడు ముందుకొచ్చిండు. ఇలా ఈరోజు చెన్నూర్ టైగర్ అయ్యిండు. ఉస్మానియా గడ్డ మీద వీరోచితంగా పోరాటం చేసిండు. తెలంగాణ వచ్చాక ఓ పెద్ద బాహుబలిని ఎదుర్కొని మీ ప్రేమతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. తర్వాత చెన్నూర్లో… ఎమ్మెల్యే అయ్యాడు. ఇలాంటి అద్భుతమైన నాయకుడు, దమ్మున్న నాయకుడు బాల్క సుమన్ను కాపాడుకోవాలి. మీరు కడుపు నిండా ఆశీర్వాదం ఇచ్చి.. పెద్ద మెజార్టీతో పంపిస్తే మరిన్ని నిధులు వరదలా పారుకుంటూ వస్తాయి. తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మంత్రులు చేయని పనులు చేసిండు.. రేపు కేసీఆర్ దయతలచి ప్రమోషన్ ఇస్తే.. మంత్రైతే ఏమైతదో.. చెన్నూర్ ప్రజలు దయచేసి ఆలోచన చేయండి.