ఎదులాపురం,మే29: బీఆర్ఎస్ బహుజనులకు అండగా నిలుస్తున్నదని , కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీహిల్స్ కాలనీలో మాదిగ సంక్షేమ సంఘ స్థలంలో భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ముందుగా సంఘం నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించి స్వాగతించారు. భవన నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన మైసమ్మకు ఎమ్మెల్యే పూజలు చేశారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటాటలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తాను మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటానని చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇచ్చిన మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. మాదిగ సంక్షేమ సంఘానికి స్థలం కేటాయింపు పూర్తయిందని, ఇక్కడ అవసరమైన భవనాలు నిర్మించేందుకు త్వరలోనే రూ.2కోట్లు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్,సంఘం నాయకులు అలాల్ అజయ్, మనోజ్, చందాల రాజన్న, దయాకర్, నవీన్ కుమార్,ఏవన్, నాగన్న, నక్కరాందాస్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.